Friday, 9 February 2018

స్వీయ చిత్రాలు (సెల్ఫీలు) ....... దొంగ సంతకాలు

స్వీయ చిత్రాలు(సెల్ఫీలు) .. దొంగ సంతకాలు 
ఘరానా మోసాలకు పాల్పడిన నిందితుడి అరెస్టు 
ఇతర కేసుల్లో పట్టుబడిన మరో నలుగురు మోసగాళ్లు

హైదరాబాద్‌: మంత్రులు, రాజకీయ ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలకు హాజరై వారితో స్వీయ చిత్రాలు (సెల్ఫీలు) దిగడం.. ఐఏఎస్‌ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం.. వాటిద్వారా అమాయకులను నమ్మించి రూ.లక్షల వసూళ్లకు పాల్పడటం.. ఈ తరహా మోసాల్లో రాటుదేలిన నిందితుడు కనుకుర్తి చంద్రశేఖర్‌ను మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. హుంద్యాయ్‌ క్రెటా కారు, రెండు చరవాణులు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నడకుదురు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ బి.ఫార్మసీ చదువుకున్నాడు. కొద్దినెలల క్రితం ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ కోల్‌కతాకు చెందిన కౌశిక్‌ అనే గుత్తేదారు నుంచి రూ.50 లక్షలు తీసుకున్నాడు. తర్వాత కనిపించకపోవడంతో అతడు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  
పల్స్‌ ఫార్మాకు టోకరా: తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్‌ఐ, ప్రభుత్వ వైద్యశాలలకు మందులు సరఫరా చేసే కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ తనకు పరిచయమైన పల్స్‌ ఫార్మా డైరెక్టర్‌ సురేష్‌ బాబును చంద్రశేఖర్‌ నమ్మించాడు. అక్కడ లైజన్‌ అధికారిగా చేరాడు. రెండు రాష్ట్రాల ఐఏఎస్‌ అధికారుల సంతకాలతో బోగస్‌ ఆర్డర్లు తయారు చేశాడు. మందులు కొనాలంటే రూ.12 లక్షలు లంచం ఇవ్వాలని సురేష్‌ బాబు వద్ద తీసుకున్నాడు. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద పల్స్‌ఫార్మా కంపెనీకి రూ.7.72 కోట్లు చెల్లించాలంటూ తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు సంతకం ఫోర్జరీ చేసి లేఖను సృష్టించాడు. దీన్ని పల్స్‌ ఫార్మా కంపెనీకి ఇవ్వగా.. వారు మల్లాపూర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ కార్యాలయంలో సమర్పించారు. ఆ బ్యాంకు మేనేజర్‌కు అనుమానం వచ్చి సచివాలయంలోని ఆంధ్రాబ్యాంక్‌ ఉన్నతాధికారులను సంప్రదించారు. వారు వెంటనే ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు దృష్టికి తీసుకెళ్లగా.. తాను సంతకం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారులు సైఫాబాద్‌ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు చంద్రశేఖర్‌ కదలికలపై నిఘా ఉంచి పట్టుకున్నారు.
జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాల పేరుతో.. : రాజేంద్రనగర్‌లో ఉంటున్న ఆర్‌.రాజశేఖర్‌, ఆర్‌.రమాకాంత్‌లు జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతుండగా అరెస్ట్‌ చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. వీరిద్దరూ ఐఏఎస్‌ అధికారి రాజేశ్వర్‌ తివారీ, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ సంతకాలను ఫోర్జరీ చేసి లేఖలు సృష్టించారు. వాటి ఆధారంగా నియామక పత్రాలు ఇచ్చి, నిరుద్యోగులను మోసం చేసి రూ.లక్షలు వసూలు చేశారని వివరించారు.
ప్రసారభారతిలో కొలువంటూ..: గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కార్యదర్శి, ఐఏఎస్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ సిఫార్సు చేసినట్టు ఆయన సంతకం ఫోర్జరీ చేసి ప్రసారభారతిలో ఇంజినీరుగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఇద్దరు నిందితులు డి.రోహిత్‌ కుమార్‌(23), టి.కాశీశ్వరరావు(24)లను అరెస్ట్‌ చేశామని కమిషనర్‌ తెలిపారు.

No comments:

Post a Comment