Saturday, 17 February 2018

లక్ష రుణానికీ యక్ష ప్రశ్నలు ఖాతా తెరవాలన్నా ఇబ్బందే ఇంటి రుణానికీ ఇక్కట్లే! బ్యాంకుల నిబంధనలు సామాన్యులకేనా..!


లక్ష రుణానికీ యక్ష ప్రశ్నలు 
ఖాతా తెరవాలన్నా ఇబ్బందే ఇంటి రుణానికీ ఇక్కట్లే! 
బ్యాంకుల నిబంధనలు సామాన్యులకేనా..! 
గత 15 ఏళ్లలో దాదాపు రెండున్నర లక్షల మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో చాలామంది ఆత్మహత్యల వెనుక కారణం.. అప్పులే. 2015లో 3000 మంది రైతులు ఆత్యహత్య చేసుకోగా.. వీరిలో 80 శాతం మంది రుణాలు చెల్లించలేక తనువు చాలించినట్లు ఒక అధ్యయనం వెల్లడించింది కూడా. వీళ్లందరి సగటు రుణం రూ.2 లక్షల్లోపే. మరి నీరవ్‌ మోదీ విషయానికొస్తే.. 
రూ.11,000 కోట్లు పైబడిన రుణం. అది కూడా ఓ బ్యాంకును తప్పుదారి పట్టించి.. ఎగ్గొట్టేయడం.. దేశం విడిచిపారిపోవడం.. తలుచుకుంటేనే రక్తం మరిగిపోదూ...సామాన్యుడి కోణంలో ఆలోచించినప్పుడు నీరవ్‌ ఉదంతం మాత్రం కచ్చితంగా మన బ్యాంకింగ్‌ వ్యవస్థ లోటుపాట్లను తెలియజెప్పేదే..
మా అబ్బాయికి ఓ జాతీయ బ్యాంకులో ఖాతా ఉంది. హైదరాబాద్‌లో ఉండగా ఆ ఖాతా ప్రారంభించాడు. ఇప్పుడు మేం బెంగళూరు వచ్చేశాం. అక్కడి ఖాతాను బెంగళూరుకు మార్చి యాక్టివేట్‌ చేయించాలన్నది మా ఉద్దేశం. ఇందుకోసం బ్యాంకు చుట్టూ తిరగడం ఇప్పటికిది పన్నెండోసారి. ఈరోజు కూడా పని పూర్తవుతుందన్న నమ్మకం మాత్రం లేదు. అన్ని డాక్యుమెంట్లూ పట్టుకునే వెళ్లా. దానిమీద మా అబ్బాయి సంతకాలు కూడా ఉన్నాయి.. అయితేనేం.. అయిదుసార్తు తిప్పించుకున్న తర్వాత వాళ్లు చెప్పిన మాట ఏమిటంటే.. మీ అబ్బాయి రావాల్సిందేనని. వాడికి సెలవు దొరకడం లేదు.. అందుకే రాలేకపోతున్నాడు. నేను అతని తండ్రినే. కావాలంటే చూడండి అంటూ ఆధారాలు కూడా చూపించాను. నాకు పాస్‌బుక్‌, ఏటీఏం కార్డు... ఏదీ ఇవ్వొద్దు. కేవలం ఖాతా యాక్టివేట్‌ చేయండి చాలు. వీలు చూసుకుని మా అబ్బాయి వచ్చి వాటిని తీసుకెళ్తాడు అని భరోసా ఇచ్చా. పట్టించుకుంటేగా.. పొద్దున వెళితే సాయంత్రం రమ్మంటారు.. సాయంత్రం వెళ్తే.. రేపు రమ్మంటారు. వెళ్లినప్పుడల్లా అరగంట కూర్చోబెడుతున్నారు. మా అబ్బాయి రావాల్సిందేనంటున్నారు.. నేను డబ్బు కాజేసే రకం కానందుకేనేమో ఈ ఇబ్బందులు అనిపిస్తోంది.. నీరవ్‌ మోదీకి రూ.11,400 కోట్లు ఇచ్చే విషయంలో ఇలాంటి నిబంధనలన్నీ ఏమయ్యాయో...’
- ఓ సగటు ఖాతాదారు ఆవేదన..

అంటే బ్యాంకు అధికారులను నిబంధనలు ఉల్లంఘించమని కాదు. సామాన్యుల విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహరించే బ్యాంకులు.. బడాబాబుల విషయానికొచ్చేసరికి.. ఎందుకు నీళ్లొదిలేస్తున్నారన్నది సామాన్యుడి ప్రశ్న. 
ఓ విజయ్‌ మాల్యా.. ఓ నీరవ్‌ మోదీ..నోట్ల రద్దు సమయంలో పెద్ద ఎత్తున దొరికిన కొత్త నగదు నిల్వలు.. వీటి గురించి విన్న సాధారణ ఖాతాదారులకు ఇలాంటి ఆవేదనే కలుగుతుంది... ఆ బాధలో కాస్త నిజం కూడా ఉందనిపిస్తుంది...
ప్రజాస్వామ్య దేశం.. ప్రజలే ప్రభువులు.. సామాన్యులకైనా.. అసామాన్యులకైనా.. నిబంధనలు ఒక్కటే... కానీ, కొంతమందికి ఇందులో కొన్ని సడలింపులు ఉంటున్నాయా..!!
బ్యాంకులో నగదు నిల్వ ఉంటుంది. అందులో నుంచి ఓ రూ.10వేలు తీసుకుందామంటే.. ఎక్కడా కుదరదు.. ఎన్ని ఏటీఎంలకు వెళ్లినా.. డబ్బే దొరకదు. బ్యాంకుకు వెళ్తే.. చాంతాండంత వరసలు. గట్టిగా రూ.20వేలు ఇవ్వాలంటే కూడా పాన్‌ కావాలి.. ఆధార్‌ కావాలంటూ ఆరాలు.. అదే.. బ్యాంకుకు కావాల్సిన వ్యక్తి రాగానే.. అడిగిన మొత్తం కట్టలుకట్టలుగా ఇచ్చేస్తుంటారు.. ఇక్కడ వారికి ఏ ‘రూలూ’ వర్తించదు.
సొంతిల్లు కలను నిజం చేసుకోవాలనుకొనే సగటు వేతన జీవి... గృహ రుణం కోసం వెళ్తాడు.. ఆస్తి విలువలో 80శాతం వరకూ వస్తుందని అనుకుంటారు.. కానీ, క్రెడిట్‌ స్కోరు.. రుణ చరిత్ర అంటూ మొదటే నిబంధనలు అడ్డుకుంటాయి.. పైగా ఇప్పటికి ఎన్నిసార్లు రుణం కోసం బ్యాంకులను అడిగారు.. ఏళ్ల తరబడి లెక్కలు... ఎప్పుడో ఏళ్ల క్రితం మనం మర్చిపోయిన క్రెడిట్‌ కార్డుకు రూ.100 బాకీ ఉన్నారు.. కాబట్టి, మీకు ఇప్పుడు రుణం ఇవ్వడం కుదరదు అంటూ.. ఓ వివరణ..
నిబంధనల మేరకు విద్యా రుణాలు దొరకవు.. రూ.4లక్షల్లోపు హామీ అక్కర్లేదని స్పష్టమైన ఉత్తర్వులున్నా.. ఏ బ్యాంకూ దాన్ని పట్టించుకోదు.. తనఖా లేకుంటే అప్పు పుట్టదు. ప్రభుత్వం ప్రకటించిన ‘ముద్ర’ అప్పు లభించడమూ కష్టమే.. ఏమన్నా అంటే.. ‘బ్యాంకుల విచక్షణ’, ప్రజల సొమ్ముకు భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యం అంటూ చెబుతుంటారు.. అర్హత లేకున్నా వేల కోట్ల రుణాలను ఇచ్చేప్పుడు ఈ నిబంధనలన్నీ ఎటు వెళ్తాయో బ్యాంకులకే తెలియాలి.
బ్యాంకు నిబంధనల మేరకు ఏదైనా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు తనఖా పెట్టిన ఆస్తిని ఒకరు పరిశీలిస్తారు.. మరొకరు ధ్రువీకరిస్తారు. మధ్యలో ఎంతోమంది చేతుల నుంచి ఆ ప్రక్రియ ముందుకు వెళ్తుంది. చివరగా అన్నీ సరిగ్గా ఉన్నాయని తేలితేనే ఓ లక్ష రూపాయల రుణమైనా ఇస్తుంది. కానీ, కావాల్సిన వ్యక్తులు.. బడా పారిశ్రామికవేత్తలు.. కమీషన్లతో సిబ్బంది జేబులు నింపేందుకు వెనకాడని వారి విషయంలో ఈ పరిశీలనలూ.. ఇతర నిబంధనలూ ఓ ప్రహసనంగానే మారిపోతున్నాయన్నది సగటు వ్యక్తి ఆవేదన. ఒకే ఆస్తిపై రెండు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలాంటి సంఘటనలు కూడా ఎన్నో..
ఇక సామాన్యుడికే రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరులాంటి అడ్డంకులు.. అప్పటికే కోట్ల రూపాయలు బాకీ పడ్డా.. అవేవీ లెక్కలోకి తీసుకోకుండా.. కొత్తగా మరికొన్ని కోట్ల రూపాయలను ముట్టజెబుతూనే ఉంటాయి. ఇక్కడ ఏ స్కోరూ, చరిత్రా పరిశీలన జరగదా? జరిగినా.. బ్యాంకుల విచక్షణ.. అంటే.. కమీషన్లకు కక్కుర్తిపడ్డ ఓ ఉన్నతాధికారి లేదా అతన్ని ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడి ఇష్టమేనా? చెప్పడం కష్టమే.
మానవీయ కోణాలను కూడా ప్రస్తుత బ్యాంకింగ్‌ వ్యవస్థ విస్మరిస్తోంది అనుకోవచ్చు. గతంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా.. ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా బ్యాంకుకు వెళ్తే సరిపోయేది. యాంత్రీకరణ, డిజిటలీకరణ పెరిగిన నేపథ్యంలో బ్యాంకుకు వెళ్లినా.. వినియోగదారుల సేవాకేంద్రానికి ఫోన్‌ చేయడం మినహా వేరే మార్గం లేదు. నగదు రహిత బ్యాంకింగ్‌ వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులు సామాన్యులను ‘భౌతిక’ బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరం చేస్తున్నాయనే భావించవచ్చు. సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నంలో బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు.. ఎంతో మంది సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాయనే స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి..
ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టి..: ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం.. వాటిని అవసరమైన వారికి రుణంగా ఇచ్చి, వడ్డీ వసూలు చేయడం.. సాధారణంగా బ్యాంకు ప్రాథమిక వ్యాపారం ఇదే.. కానీ, మారుతున్న పరిస్థితుల్లో బ్యాంకు కేవలం ఈ ఒక్కదానితోనే సంతృప్తి చెందడం లేదు.. బ్యాంకస్యూరెన్స్‌ పేరుతో అందిస్తోన్న బీమా పాలసీల విక్రయాలు బ్యాంకులకు ఇప్పుడు భారీ వ్యాపారం అయ్యింది. కచ్చితంగా ఇన్ని బీమా పాలసీలు అమ్మాల్సిందే అంటూ సిబ్బందికి లక్ష్యాలు విధిస్తున్నారు.. ఇక్కడే అవినీతికి బీజం పడుతోంది.. రూ.5లక్షలకు ఓ పాలసీ తీసుకోండి... రూ.25లక్షల రుణం ఇచ్చేస్తాం అంటూ కొత్త ‘ఆఫర్లు’ పుట్టుకొస్తున్నాయి. అంటే, బీమా తీసుకొని, తొలి ప్రీమియం చెల్లిస్తే చాలు.. మీ పత్రాలు కాస్త అటూఇటూగా ఉన్నా.. బ్యాంకు పెద్దగా పట్టించుకోదన్నమాట. రుణాల వసూలు కన్నా.. ప్రీమియాల వసూలుపైనే బ్యాంకు దృష్టి ఎక్కువగా పెడుతుండటంతో పారు బాకీలు పేరుకుపోయినా పట్టించుకోవడం లేదు.
రుసుములు వసూలు చేస్తూ...
బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ ఉంచాల్సిందే. లేకపోతే రుసుములు భరించాలి.. అతి పెద్ద జాతీయ బ్యాంకు కనీస నిల్వ నిర్వహించని ఖాతాదారుల దగ్గర్నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ దాదాపు రూ.1,771 కోట్లను రుసుముగా వసూలు చేసింది. మిగతా బ్యాంకులు వసూలు చేసినవీ పెద్ద మొత్తంలోనే ఉంటాయి.
నమ్మకమైన పునాదిపై ఏర్పడిన బ్యాంకింగ్‌ వ్యవస్థ.. ఇప్పటికే సాధారణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని తాజాగా ఎన్నో ఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఇవి మున్ముందూ కొనసాగితే.. బ్యాంకులపై ప్రజలకు ఉండే నమ్మకం పోతే.. ఆర్థిక వ్యవస్థకూ ఇది పెద్ద శరాఘాతమే!

*రంగంలోకి సెబీ, ఎక్స్ఛేంజీలు
రూ.11,400 కోట్ల కుంభకోణానికి సంబంధించి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, గీతాంజలి జెమ్స్‌ల ప్రమేయంపై సెబీ దర్యాప్తును ప్రారంభించింది. ట్రేడింగ్‌ లావాదేవీలను, వెల్లడి వివరాలను పరిశీలిస్తోంది. నీరవ్‌ మోదీతో సంబంధమున్న అన్ని సంస్థల స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ లావాదేవీలను విశ్లేషించే పనిని సెబీ, ఎక్స్ఛేంజీలు మొదలుపెట్టాయి. మరోవైపు మెహుల్‌ చోక్సి, ఆయన సంస్థ గీతాంజలి జెమ్స్‌ ఏమైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాయా అనే విషయాన్ని కూడా సెబీ, ఎక్స్ఛేంజీలు దర్యాప్తు చేస్తున్నాయి.
తగిన చర్యలు తీసుకుంటాం: ఆర్‌బీఐ
పీఎన్‌బీలో నియంత్రణ వ్యవస్థల పరిశీలనను ఇప్పటికే ప్రారంభించామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. పరిశీలన అనంతరం తగువిధంగా చర్యలు చేపడతామని పేర్కొంది. మరోవైపు ఇతర బ్యాంకులకు జారీ చేసిన ఎల్‌ఓయూల ప్రకారం అవి ఇచ్చిన రుణాలకు నిధులు సర్దుబాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు వస్తోన్న వార్తలను ఆర్‌బీఐ ఖండించింది.
నేడు బ్యాంకర్ల సంఘం భేటీ
పీఎన్‌బీలో వెలుగుచూసిన రూ.11,400 కోట్ల కుంభకోణంపై చర్చించేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) నేడు సమావేశం కానుంది. ఇంతకుమునుపు పీఎన్‌బీకి మేనేజింగ్‌ డైరెక్టరుగా ఉన్న ఉషా అనంతసుబ్రమణియన్‌ ప్రస్తుతం ఐబీఏకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం. అలాగే ఈమె అలహాబాద్‌ బ్యాంక్‌కు ఎండీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీఎన్‌బీ కొన్ని ఎల్‌ఓయూలను అలహాబాద్‌ బ్యాంక్‌కు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలాంటి మోసాలు జరగకుండా వ్యవస్థల పటిష్ఠంపై సమీక్ష నిర్వహించాలని బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచించింది. ఒకవేళ ఏమైనా లోపాలు గుర్తిస్తే, తగువిధంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తెలిపింది.
ఆడిటర్ల పాత్రపై ఐసీఏఐ కమిటీ ఏర్పాటు
పీఎన్‌బీ రూ.11,400 కోట్ల కుంభకోణంలో ఆడిటర్ల పాత్రపై చార్టెడ్‌ అకౌంటెంట్ల అత్యున్నత సంఘం ఐసీఏఐ (ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) దృష్టి సారించింది. ఇందుకు వివిధ దర్యాప్తు సంస్థల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అలాగే కుంభకోణానికి దారితీసిన పరిణామాలు, వ్యవస్థీకృత లోపాలను అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆడిటర్ల తరపున ఏమైనా అవకతవకలు చోటుచేసుకున్నాయా అనే విషయాన్ని పరిశీలించనుంది. పీఎన్‌బీ కుంభకోణం వ్యవహారాన్ని సుమోటో కేసుగా స్వీకరించినట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్‌ నవీన్‌.ఎన్‌.డి.గుప్తా తెలిపారు.
150
డొల్ల కంపెనీలకు నీరవ్‌తో సంబంధం
నీరవ్‌ మోదీ, అతని సంబంధీకులతో 150 డొల్ల కంపెనీలకు సంబంధం ఉందని ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. కార్పొరేట్‌ వ్యహారాల మంత్రిత్వ శాఖ ఆ మేరకు వెల్లడించింది. దర్యాప్తు సంస్థలు, ఆదాయ పన్ను అధికారుల దర్యాప్తుతో పాటు ఈ మంత్రిత్వ శాఖ కూడా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. వ్యాపార కార్యకలాపాలు పెద్దగా లేనప్పటికీ కేవలం చట్టవ్యతిరేకంగా లావాదేవీలను జరపడం కోసం ఈ డొల్ల కంపెనీలకు ఉపయోగించుకుంటుంటారు.

No comments:

Post a Comment