Wednesday, 14 February 2018

యమభటుల్ని ఓడిస్తున్న రక్షక భటులు! పునర్జన్మలు ప్రసాదిస్తున్న పహారా 73 రోజుల్లో 51 మందికి ప్రాణదానం సాగర్‌ చుట్టూ రక్షణ కవచం లేక్‌ పోలీస్‌



యమభటుల్ని ఓడిస్తున్న రక్షక భటులు! 
పునర్జన్మలు ప్రసాదిస్తున్న పహారా 
73 రోజుల్లో 51 మందికి ప్రాణదానం 
సాగర్‌ చుట్టూ రక్షణ కవచం లేక్‌ పోలీస్‌ 


నగరం నడిబొడ్డున విరాజిల్లుతున్న పర్యాటక కేంద్రం హుస్సేన్‌సాగర్‌. ప్రశాంతమూర్తి గౌతమబుద్ధుడు, తెలుగు తేజాల విగ్రహాలు, సాగర్‌ జలాలపై హొయలుపోయే అలలు..  ఆ మధురానుభూతి వర్ణనాతీతం. ఎంతోమంది ఇక్కడి ఆహ్లాదాన్ని కోరుకుంటారు. సాయంత్రం పర్యాటకుల తాకిడితో ఎంతో సందడిగా ఉంటుంది. కొందరు మాత్రం తీరని వేదనతో సాగర తీరాన్ని చేరుతుంటారు . చుట్టూ వందల మంది కేరింతల నడుమ ఆనందంగా గడుపుతున్నప్పటికీ వీరు మాత్రం జీవితంపై కనీస ఆశ లేకుండా బలవన్మరణాలకు ఒడిగట్టేందుకు యత్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలమైందని కొందరు, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని ఇంకొందరు, వృద్ధాప్యం, అనారోగ్యం... ఇలా కారణమేదైనా తీవ్ర మానసిక వేదన, ఒత్తిడితో జీవితాన్నే ముగించేద్దామని నిర్ణయం తీసుకుంటున్నారు. సాగర్‌జలాల్లో దూకి ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల రక్షణతోపాటు శాంతి భద్రతల విధులు నిర్వహిస్తున్న ఇక్కడి లేక్‌ పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ గడిచిన 73 రోజుల్లో 51 మందిని కాపాడారు. ఒక్కసారి గమనిస్తే హుస్సేన్‌సాగర్‌ జలాల్లో ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య ఎంతలా ఉందో అర్థమవుతుంది.
16 ఏళ్లుగా సేవలు...
నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌ను సందర్శించేందుకు ప్రతిరోజూ వేలాదిగా పర్యాటకులు, సందర్శకులు తరలివస్తుంటారు. పరిసర ప్రాంతాల ప్రజలు వ్యాయామం, ఉదయపు నడక కోసం ఇక్కడికి వస్తుంటారు. నిత్యం సందడి నెలకొని ఉంటుంది. పర్యాటకుల రక్షణ కోసం శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సాగర్‌లో పడిపోయిన వారిని రక్షించేందుకు సెంట్రల్‌ జోన్‌ తొలి డీసీపీ సీవీ ఆనంద్‌ ఇక్కడ లేక్‌ ఠాణాను నెలకొల్పారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాలైన గాంధీనగర్‌, సైఫాబాద్‌, రాంగోపాల్‌పేటల సమన్వయంతో లేక్‌ఠాణా విధులు నిర్వహిస్తుంది. తొలినాళ్లలో పర్యాటక విభాగం నుంచి ప్రత్యేకంగా ఓ బోటు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించేవారు. రంపచోడవరం నుంచి గజ ఈతగాళ్లను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చారు. గడచిన ఆరేళ్లలో 783 మందిని కాపాడారు.
కంచెలేని చోట అత్యంత ప్రమాదకరంగా...
ఆరు కిలోమీటర్ల మేర విస్తరించిన సాగర్‌ పరిసరాల్లో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎత్తైన కంచె లేదు. ఏళ్ల క్రితం సాగర్‌ చుట్టూ ఏర్పాటు చేసిన సుమారు రెండున్నర అడుగుల ఫెన్సింగ్‌  ఉంది. ఇటీవల అధికారులు సాగర్‌కు కొంతమేర చుట్టూ ఎత్తైన కంచెను ఏర్పాటు చేశారు. పూజస్థల్‌, పికాక్‌స్టాచ్‌, లేపాక్షి, ఓల్డ్‌ లవ్‌ హైదరాబాద్‌ స్పాట్‌ ప్రాంతాల్లోనే ఏళ్ల కాలంగా ఎక్కువ మంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇక్కడ కంచె లేకపోవడం గమనార్హం. అందుకే పోలీసులు మరింత పటిష్ఠంగా గస్తీ చేపడుతున్నారు. ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ అక్కడక్కడా దెబ్బతింది. శిథిలావస్థకు చేరిన ఫెన్సింగ్‌ను మరమ్మతులు చేయడంతోపాటు కంచెలేని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

ఆత్మహత్యలు పరిష్కారం కాదు
- ధనలక్ష్మి, సీఐ, లేక్‌ ఠాణా
జీవితం ఎంతో విలువైనది. నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగించొద్దు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. మానసిక ఒత్తిడి కలిగినా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పంచుకోవాలి. ఆత్మహత్య కోసం కాకుండా పరిష్కారం కోసం ఆలోచించాలి, ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. పిల్లల ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చినా తల్లిదండ్రులు గమనించి స్నేహపూర్వకంగా నడుచుకోవాలి. ఇక్కడి సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరూ చురుకుగా, బాధ్యతగా నిధులు నిర్వహిస్తారు. రాత్రి, పగలు తేడా లేకుండా సమాచారం వచ్చినప్పుడు ఎంతో బాధ్యతగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్నిస్తుంది.

ప్రతిక్షణం అప్రమత్తంగా..
లేక్‌ ఠాణా పరిధిలోని నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌ ప్రధాన పర్యాటక ప్రాంతాలతోపాటు ఠాణా పరిధిలోని ప్రాంతాల్లో విధులు నిర్వహించడం ఓ విధంగా కత్తిమీద సాము లాంటిదే. ఓ పక్క పర్యాటకుల రక్షణ చూస్తూనే... బలవన్మరణాలకు పాల్పడే వారిని గమనిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సాగర్‌ చుట్టూ పోలీసులు ప్రతిక్షణం మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఆరు కిలోమీటర్ల పరిధిలో కొనసాగుతున్న ఇక్కడి ఠాణాలో సుమారు 35 మంది సిబ్బంది విడతల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. మూడు ద్విచక్రవాహనాలతో ఆరుగురు సిబ్బంది, గస్తీ నిర్వహించే ఓ కారు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు గుర్రాలపై సిబ్బంది, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ కొంత మంది సిబ్బంది, ఓ ఏఎస్సై ఎప్పటికప్పుడు ఠాణా సీఐతో సమన్వయం చేస్తూ ఇక్కడి పరిసరాలను గమనిస్తుంటారు. అనుమానం వస్తే వెంటనే ఠాణాకు తీసుకెళ్లి వివరాలు తెలుసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఎవరైనా నీళ్లలో దూకితే ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. లేక్‌పోలీసుల అప్రమత్తతతో గడిచిన 73 రోజుల్లో 51 మందిని రక్షించారు. ఒక్కోసారి నిమిషం ఆలస్యమైనా ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయినట్లే. ఇక్కడి పరసరాల్లో గస్తీ నిత్యం కంచెను తలపిస్తుంది.

No comments:

Post a Comment