Thursday, 15 February 2018

కాపు కోటాకు 'తెలంగాణ పేరు ప్రస్తావనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అభ్యంతరం గందరగోళం

కాపు కోటాకు 'తెలంగాణ పేరు ప్రస్తావనతో అభ్యంతరం 



కాపు కోటాకు అభ్యంతరం
కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సిబ్బంది శాఖ
రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీం చెప్పిందని వెల్లడి
తెలంగాణ పేరు ప్రస్తావనతో గందరగోళం

కాపుల రిజర్వేషన్ల అంశానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఒక బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అభిప్రాయాన్ని కోరింది. వాటిలో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) కూడా ఒకటి. దీనిపై డీఓపీటీ తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ- రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది. 1992 నవంబరు 16న ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం- రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి లేదనీ, ఒకవేళ అంతకు మించి కల్పించాలంటే అందుకు బలమైన ప్రాతిపదికగానీ, అసాధారణ పరిస్థితులు గానీ  అవసరమని పేర్కొంది. అయితే తాజా బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలాంటి బలమైన ప్రాతిపాదికలు ఏమిటో స్పష్టం చేయలేదని అభిప్రాయపడింది. అలాగే రిజర్వేషన్లనేవి ఆయా వర్గాలకు ‘సముచిత రీతిలో’ కల్పించాలే తప్ప జనాభా ప్రాతిపదికన కాదన్న రాజ్యాంగ నిబంధనను సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాన్నీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ల బిల్లుపై ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం లేదని హోం శాఖ రాష్ట్రపతికి సూచించొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఇదే లేఖలో- ఓబీసీల్లో ఉపవర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ను నియమించిన విషయాన్ని కూడా డీఓపీటీ గుర్తు చేసింది. ఆ కమిషన్‌ ఓబీసీల ఉపవర్గీకరణ శాస్త్రీయంగా చేయటానికి అవసరమైన విధివిధానాలను, ఇతర ఏర్పాట్లను ఖరారు చేసే పనిలో ఉందని పేర్కొంది.

లేఖలో తెలంగాణ ప్రస్తావన!
కాపుల రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ లేఖలో ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘తెలంగాణ ప్రభుత్వం’ అని అచ్చు కావటంతో కొంత గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే బిల్లును శాసనసభలో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇంతవరకు దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి అందలేదు. 
తెలంగాణ గురించి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు..
తాజా లేఖ నేపథ్యంలో తెలంగాణలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి కేంద్రం ఆమోదంపైనా అనిశ్చితి నెలకొంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన లేఖలో కోటా 50 శాతానికి పెంచకూడదన్న సుప్రీం తీర్పునే ప్రస్తావించడం.. రిజర్వేషన్లకు జనాభా ప్రాతిపదిక కాదని అభిప్రాయపడడంతో ఇవే నిబంధనలతో తెలంగాణ విన్నపానికి కూడా విఘాతంగా తయారవ్వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు పరచడం.. ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం వంటి అంశాలను కూడా  కేంద్రానికి పంపిన లేఖలో వివరించామని తెలంగాణ అధికార వర్గాలు చెప్పాయి. ఈ లేఖలోని విషయాలను తెలంగాణ అధికారులు దిల్లీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అధికారులను, ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం. 

No comments:

Post a Comment