ఆ విధానంతో గ్రీన్కార్డుల పెండింగ్కు చెక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న వలస విధానంతో గ్రీన్కార్డుల పెండింగ్ తగ్గిపోతుందని అధ్యక్ష నివాసం వైట్హౌస్ వెల్లడించింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ప్రతిభ ఆధారిత వీసాలు ఇవ్వాలని ట్రంప్ మద్దతిస్తున్న వలస విధానంతో నైపుణ్యం గల ఉద్యోగుల గ్రీన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ తగ్గిపోయే అవకాశముందని తెలిపింది. గ్రీన్ కార్డుల విషయంలో ఒక్కో దేశానికి ఇచ్చే కోటాను రద్దు చేయాలని భారతీయ హెచ్1బీ వీసాదారులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వైట్హౌస్ ఈ ప్రకటన చేసింది. హెచ్1బీ వీసాల ద్వారా అమెరికాకు వెళ్లిన చాలా మంది భారతీయ అమెరికన్లు గ్రీన్ కార్డుల విషయంలో దేశాల వారీ కోటా కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది మంది భారతీయ అమెరికన్ల గ్రీన్కార్డు దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి.
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పలురకాల వీసాలపై వచ్చిన భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో పలువురు వాషింగ్టన్ చేరుకుని గత వారం రోజులుగా వలస విధానాల్లో మార్పు తీసుకురావాలని ట్రంప్ను, కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత వలస విధానానికి స్వస్తి పలకడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టాన్ని నివారించనున్నామని వైట్హౌస్ ఈ నేపథ్యంలో ప్రకటించింది. దీనిపై ట్రంప్ కూడా ట్విటర్ ద్వారా స్పందించారు. లాటరీ విధానాన్ని రద్దు చేసే సమయం వచ్చింది, కాంగ్రెస్కు భేషైన వలస విధానాన్ని రూపొందించాల్సిన, అమెరికన్లను కాపాడాల్సిన అవసరముందని ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రతిభ ఆధారిత వలసల ద్వారా ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతుల్ని, నిపుణులను అమెరికాకు వచ్చేలా ఆకర్షించాలని భావిస్తున్నారు.
No comments:
Post a Comment