Sunday, 4 February 2018

ఫేస్‌బుక్‌ కీచకులు.. వాట్సాప్‌ రావణులు ఉన్నారు జాగ్రత్త!

ఫేస్‌బుక్‌ కీచకులు.. వాట్సాప్‌ రావణులు
ఉన్నారు జాగ్రత్త!
సరదాగా సెల్ఫీ దిగి.. వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టడం... ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం... మనలో ఎక్కువమంది రోజూ చేస్తున్నదే. మంచిదే. టెక్నాలజీని  వాడుకోవడం కూడా తప్పేమీ కాదు. కానీ మనకు సంబంధించిన విషయాలూ, ఫొటోలు దుర్వినియోగం అయి... మన పరిచయస్తులూ, సన్నిహితులకు కాకుండా... కొత్తవారికి తెలిసి.. బెదిరింపులు ఎదురైతేనే సమస్య. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే... కొన్ని జాగ్రత్తలు తప్పవు. 

*కీర్తి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. ఓరోజు ఉదయం ఫేస్‌బుక్‌ తెరిచింది. అకౌంట్‌నుంచి పదుల సంఖ్యలో ఫ్రెండ్‌ రిక్వెస్టులు వెళ్లాయి. ఫొటోలు, వీడియోలు ఫార్వర్డ్‌ అయ్యాయి. ఫోన్‌ హ్యాక్‌ అయిందని తెలిసింది. పోలీసులు ఆరా తీస్తే క్లాసులోని రోహిత్‌ ఇదంతా చేశాడని తెలిసింది. కీర్తి స్నేహితురాలు జెన్నీ ద్వారా పాస్‌వర్డ్‌ సంపాదించటంతో అతని పని సులువైంది. 
*స్వాతికి వాట్సప్‌లో అశ్లీల ఫొటోలు, వీడియోలు విపరీతంగా వచ్చేవి. నాలుగైదు రోజుల తరువాత సైబర్‌ క్రైమ్‌ ఆఫీసుకి వెళ్లి కంప్లయింట్‌ ఇచ్చింది. ఆరాతీస్తే.. యూపీ నుంచి అంకిత్‌ అనే మైనర్‌ ఇదంతా చేస్తున్నాడని తెలుసుకుని హైదరాబాద్‌కి పిలిపించారు. అంకిత్‌ అమాయకుడు. ఇంకా తీగలాగితే.. హైదరాబాద్‌లో స్వాతి ఇంటి దగ్గర ఉండే ఒకడు అంకిత్‌ సిమ్‌ నంబర్‌తో వాట్సప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అలా వేధించాడని తేలింది. 
*ఫుడ్‌ డెలివరీ కంపెనీలో పని చేసే రంజిత్‌ వందలమంది మహిళల ఫోన్‌ నంబర్లు సంపాదించాడు. వారి వాట్సప్‌లకు అసభ్యకరమైన రాతలతో పాటు.. అశ్లీల ఫొటోలూ, వీడియోలు రోజూ పంపించేవాడు. ఎవరికీ చెప్పుకోలేక.. చాలామంది మహిళలు మానసికంగా కుంగిపోయారు. కొందరయితే సిమ్‌కార్డ్‌నే మార్చేశారు. ఓ ప్రొఫెసర్‌నూ ఇలానే వేధించాడు. ఆమె తన భర్తకు విషయం చెప్పి సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. కేస్‌ బుక్‌ అవుతూనే.. రంజిత్‌ను ట్రేస్‌ చేసి పోలీసులు పట్టుకున్నారు. అతని ఫోన్‌లో నూటయాభైకి పైగా మహిళల నంబర్లున్నాయి. ‘నాకిదో హాబీ’ అని రంజిత్‌ చెప్పుకొచ్చాడు. మరో ముగ్గురు మహిళలు రంజిత్‌పై రిపోర్ట్‌ చేయడంతో.. పోలీసులు పీడీయాక్ట్‌ ఫైల్‌  చేసి జైలుకి పంపించారు. 
వన్నీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ సెల్‌కి వచ్చిన కేసులు. అదీ స్మార్ట్‌ఫోను వల్లే. మీ ఫోన్‌ మీ దగ్గరే ఉండొచ్చు. మీ వ్యక్తిగత అవసరాలకే వాడుకుంటూ ఉండొచ్చు. కానీ వీటి వినియోగం వల్ల ఎలా, ఎవరితో, ఏ నిమిషం.. వేధింపులకి గురికావల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి. అలాగని మహిళలు ఫోన్‌ వాడకుండా ఉండలేరు కదా! ‘ముఖ్యంగా ఈ డిజిటల్‌ కాలంలో ఫోన్‌లోనే మాటామంతీ. కొంతమందైతే ఎదురెదురుగా వచ్చినా పలకరించరు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ చేస్తే చాలు.. ఇట్టే స్పందిస్తారు. వీళ్లు ఎక్కువగా వర్చువల్‌ ప్రపంచంలోనే ఉంటారు. ఆగంతుకుల బారిన పడేవారిలో ఇలాంటివాళ్లే ఎక్కువ...’ అంటారు మానసిక నిపుణులు.
ఓటీపీ సెట్‌ చేసుకోవాలి! 
* ఫోను చేసుకోవడానికో లేదా తమ ఫోనులో ఉన్న సమస్యను పరిష్కరించమంటూ అమ్మాయిలు ఫోన్‌ని తెలిసినవారికి ఇస్తారు. అతడే సైబర్‌ నేరగాడు అయి ఉండొచ్చు. ఫోను తీసుకున్న వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఉచితంగా దొరికే స్పై అప్లికేషన్స్‌ను అందులో డౌన్‌లోడ్‌ చేయొచ్చు. అదే జరిగితే మీ ఫోను డ్యాష్‌బోర్డులా ఉపయోగపడుతుంది. మీరు పంపే మెసేజ్‌లు, వాట్సప్‌తో పాటు ఫేస్‌బుక్‌ ఛాట్‌, ఫొటోలు, వీడియోలు.. అన్నీ చూడగలుగుతాడు. బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రమాదం ఉంటుంది. 
* అమ్మాయిల ఎఫ్‌బీ అకౌంట్స్‌కి ‘మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోండి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి’ అంటూ మెసేజ్‌  చేస్తారు. దాన్ని నమ్మితే ఫేస్‌బుక్‌ హ్యాక్‌ కావచ్చు. మీ ఫోన్‌తో పాటు పీసీ కూడా హ్యాక్‌ అవుతుంది. 
* ఫోన్లలో లాక్‌లు తెరిచేప్పుడు మీ వేళ్ల కదలికను బట్టి సైబర్‌ నేరగాళ్లు వాటిని గుర్తుంచుకునే అవకాశం ఉంటుందనీ మరవకూడదు. 
* ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేయాలంటే ఓటీపీ లాగిన్‌ను పెట్టుకోవాలి. సీక్రెట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే చాలు. ఎవరైనా మీ ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేస్తే ఓటీపీ మీ ఫోన్‌కు వస్తుంది. అలా సులువుగా అర్థమవుతుంది. ఈమెయిల్‌కీ ఇదే వర్తిస్తుంది. 
* అమ్మాయిలు ఫొటో ఎడిటింగ్‌ యాప్స్‌ను థర్డ్‌పార్టీవి డౌన్‌లోడ్‌ చేయకూడదు. కొందరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేప్పుడు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు వాడుతుంటారు. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ మీ కార్డుల చిట్టాను చెబుతాయి.
* ఈ మధ్యకాలంలో నేరగాళ్లు కొత్తపంథా అనుసరిస్తున్నారు. అమ్మాయిల ఫోన్‌ నెంబర్‌ తీసుకుని డీపీ ఫొటోను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. కొన్ని టూల్స్‌ ఉపయోగించి ఆ అమ్మాయితో నేరగాడు క్లోజ్‌గా చాట్‌ చేసినట్లు క్రియేట్‌ చేసి దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి వాళ్లకే పంపిస్తారు. అలా బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. ఈ నియమాలు అమ్మాయిలకే కాదు స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. 
* ఒకవేళ ఫోను పోగొట్టుకుంటే వాట్సాప్‌ అకౌంట్‌ని తొలగించాలి.  ముఖపరిచయం లేని వ్యక్తుల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను అనుమతించకూడదు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఫొటో డౌన్‌లోడ్‌ చేయకుండా సెట్టింగ్‌లు పెట్టుకోవాలి. అనుమతించే ముందు ఒకటికి రెండు సార్లు గమనించుకోవడం మంచిది. పబ్లిక్‌ వైఫైలు వాడకుండా స్వీయ నియంత్రణ తప్పనిసరి. 
మన జీవితం ఇతరులకెందుకూ...?
‘‘కొందరమ్మాయిలు పొద్దస్తమానం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో స్టేటస్‌లు అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఫొటోను ఎవరెవరు చూశారో, ఎంతమంది లైక్‌ చేశారోనని పదే పదే గమనిస్తుంటారు. మరి కొందరైతే బ్యూటీ యాప్స్‌ కనిపిస్తే చాలు వాటి వివరాలేవీ తెలుసుకోకుండా డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. వేధింపులకు గురయ్యేవారిలో ఇలాంటివారే ఎక్కువ. ‘దాదాపు ఎనభై ఐదు శాతం మంది సైబర్‌ నేరగాళ్లు 18 నుంచి 35 ఏళ్ల వయసువారే. ఏ వయసువాళ్లు ఎలాంటి యాప్స్‌కి ఆకర్షితులవుతారో, ఎలాంటి మెసేజ్‌లకు స్పందిస్తారో వాళ్లకు బాగా తెలుసు. ప్లేస్టోర్‌లో ఏదో యాప్‌ కనపడింది కదా అని డౌన్‌లోడ్‌ చేయకూడదు. ముందు వాటి నియమ నిబంధనలు చదవాలి. ఎక్కువ అనుమతులు అడుగుతుంటే ఆలోచించాల్సిందే. మీ జీవితంలోని ఆనందకరమైన సమయాలూ, బాధపడ్డ సందర్భాలూ, ఇష్టాయిష్టాలూ, వెళ్లిన రెస్టారంట్‌, చూసిన లేదా చూస్తోన్న సినిమా.. ఇలా ప్రతిదీ స్టేటస్‌ల రూపంలో పెట్టి.. మన వ్యక్తిగతాలు అపరిచితులకు  తెలియజేయడమెందుకూ? ఒక పోస్ట్‌ పెడితే ప్రపంచమంతా చూస్తుంది...సరే! ఆ ప్రపంచంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మేకవన్నె పులులూ పొంచి ఉంటాయనే విషయం ఎందుకు గుర్తించలేకపోతున్నారు. అవసరం మేరకే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను వినియోగించాలి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సోషల్‌ వెబ్‌సైట్స్‌లో స్వీయ నియంత్రణతో మెలగాలి’ అంటారు భరోసా టీమ్‌ ఏసీపీ కవిత.

No comments:

Post a Comment