Monday, 29 January 2018

అమెరికాలో.. సిద్దిపేట టెకీ అనుమానాస్పద మృతి

సిద్దిపేట కల్చరల్‌, జనవరి 28: సిద్దిపేటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానిక మారుతి నగర్‌ కాలనీకి చెందిన వెంకన్నగారి శ్రీనివాసులు, రాణి దంపతుల చిన్న కుమారుడు కృష్ణ చైతన్య (28) నాలుగేళ్ల క్రితం కాగ్నిజెంట్‌ సంస్థలో ఆన్‌సైట్‌ ఉద్యోగిగా అమెరికా వెళ్లారు. ఆయన ఇటీవలే డల్లా్‌సలోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో చేరారు. ఓ పేయింగ్‌ గెస్ట్‌హౌ్‌సలో ఉంటున్నారు. ఈ నెల 26న తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన కృష్ణచైతన్య.. తనకు తలనొప్పిగా ఉందని, ఉదయం మాట్లాడతానని ఫోన్‌ పెట్టేశాడు. ఈ నెల 27న అతను తన గది తలుపులు తెరవకపోవడంతో.. గెస్ట్‌హౌస్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.


 
తలుపులు తెరిచి లోనికి వెళ్లిన పోలీసులకు.. కృష్ణచైతన్య విగతజీవిగా కనిపించారు. కాగా.. కృష్ణచైతన్య బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయన మరణానికి ఆ వ్యాధే కారణమా? లేక మరేవైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. కృష్ణచైతన్య మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తెప్పించేలా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌.. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. గురువారానికి మృతదేహాన్ని భారత్‌కు తరలిస్తామని ఎన్‌ఆర్‌ఐ విభాగం అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment