Wednesday, 4 April 2018

కనీసం పది కూడా చదవలేదు.. కానీ కోట్లు ఆర్జిస్తున్నారు.

కనీసం పది కూడా చదవలేదు.. కానీ కోట్లు ఆర్జిస్తున్నారు.

‘ప్రపంచం ఏమైనా కానీ... నా కడుపులో మాత్రం ఓ కప్పు టీ పడాల్సిందే’ అన్నాడో ప్రముఖుడు. ఆయనే కాదు... ఈ జగత్తులో ఎందరికో టీతోనే తెల్లారుతుంది. ఎల్లలు లేని ఈ అభిరుచే పుణేలోని ఓ కుటుంబానికి లక్షలు కురిపిస్తోంది. కేవలం టీ అమ్మి ఆ కుటుంబం నెలకు అక్షరాలా పన్నెండు లక్షల రూపాయలు ఆర్జిస్తోంది. ఇంతకీ ఆ టీ సీక్రెటేంటనేగా..! చూద్దాం రండి...
 
పుణేలోని అప్పా బల్వంత్‌ చౌక్‌. ఎప్పుడు చూసినా కిటకిటలాడుతుంటుంది. అలాగని అక్కడేదో మార్కెట్టో... షాపింగ్‌ మాలో లేదు. ఉన్నదల్లా టీ హౌస్‌... ‘యేవలే అమృతతుల్య’! ఒక్కసారి అక్కడ ఓ సిప్పు కొడితే... ఇక రోజూ దాని ముందు క్యూ కడతారు! అంతలా ఉంటుంది టేస్ట్‌. గ్యాలన్ల కొద్దీ టీ గంటల్లో ఆవిరవుతుంది. మరే ప్రాంతంలో దొరకని ఈ రుచికి పుణేవాసులు మైమరిచిపోతున్నారు. షాప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నీలేష్‌ యేవలే మాటల్లో చెప్పాలంటే... ‘మాకు నగరంలో మొత్తం మూడు షాపులున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఈ టీ హౌస్‌లు తెరిచి ఉంటాయి. అన్నింటిలో కలిపి రోజుకు కనీసం ఐదు వేల కప్పుల టీ అమ్ముతాం. కప్పు రూ.10. నెలకు 1,000 కిలోల పంచదార, 400 కిలోల టీ పొడి ఖర్చవుతుంది’. ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చు యేవలే కుటుంబం చేసే టీ టేస్ట్‌ కెపాసిటీ ఏంటో!
 
తండ్రి బాటలోనే తనయులు...
పురందర్‌ గ్రామానికి చెందిన నీలేశ్‌ తండ్రి దశరథ్‌ యేవలే తొలుత పాలు సరఫరా చేసేవారు. 1983లో పుణేలో ఆయన ఓ దుకాణం అద్దెకు తీసుకుని టీ స్టాల్‌ పెట్టారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ మార్కెట్‌లో ఉండాలని ఆయన కలలు కనేవారు. కానీ ఆ కల నెరవేరకుండానే ఆయన చనిపోయారు. దశరథ్‌కు ఐదుగురు కుమారులు. ఆయన మరణం తరువాత తనయులు తండ్రి కల నిజం చేయాలని పూనుకున్నారు. అయితే కుప్పలుతెప్పలుగా ఉన్న టీ స్టాల్స్‌తో పాటు తమదీ ఒక స్టాల్‌ పెడితే పెద్దగా ఫలితం ఉండదని భావించారు. నాలుగేళ్ల పాటు రకరకాల టీలు ప్రయత్నించి చివరకు అప్పా బల్వంత్‌ చౌక్‌లో తొలి టీ స్టాల్‌ ‘యేవలే అమృతతుల్య’ ప్రారంభించారు. మంచి స్పందన వచ్చింది. డిమాండ్‌ పెరిగింది. దీంతో గత ఏడాది నగరంలో మరో బ్రాంచ్‌ ఏర్పాటు చేశారు. రెండు మూడు నెలల్లోనే ఆదరణ విపరీతంగా వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరో బ్రాంచీ పెట్టారు. ఇప్పుడు ‘యేవలే అమృతతుల్య’ టర్నోవర్‌ నెలకు రూ.12 లక్షలు!
 
టేస్ట్‌ సీక్రెట్‌...
‘యేవలే’ టీ కోసం జనం ఇంతగా ఎగబడటానికి కారణం... వారి ఫార్ములానే! పుణేలోని మూడు బ్రాంచీల్లో ఎక్కడ ఏ కప్పు తాగినా ఒకటే రుచి ఉంటుంది. ‘చాలా చోట్ల మరుగుతున్న నీటిలో ప్యాకెట్‌ పాలను నేరుగా పోస్తారు. ఇది ఎసిడిటీకి దారి తీస్తుంది. కానీ మా తయారీ విధానం పూర్తి ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలను రెండుసార్లు కాస్తాం. చల్లార్చిన తరువాతే టీ కలుపుతాం. అందువల్ల మా టీ తాగితే ఎసిడిటీ సమస్య రాదు. మా గ్రామం నుంచి స్వచ్ఛమైన, తాజా పాలు తీసుకొస్తాము. సల్ఫర్‌ లేని పంచదార, ఫిల్టర్‌ వాటర్‌ వాడతాం. సాధారణ పంచదారలో కెమికల్స్‌ ఉంటాయి. దానివల్ల టీ నల్లబడుతుంది’ అంటారు నీలేశ్‌. తమ దుకాణాల్లో ఆయన టైమర్లు అమర్చారు. ఏడు నిమిషాలవ్వగానే గ్యాస్‌ ఓవెన్‌ ఆగిపోతుంది. ఎక్కువ మరిగితే అసలైన రుచి పోతుందని ఇలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఒకటే ‘టీ’...
యేవలేలో అమ్మేది ఒకటే రకం ‘మిల్క్‌ టీ’. బ్లాక్‌ టీ, కడక్‌ చాయ్‌ అంటూ వేరే రకాలేమీ ఉండవక్కడ! కనీసం బిస్కెట్లు కూడా అమ్మరు. భవిష్యత్తులో మహారాష్ట్ర వ్యాప్తంగా 100 అవుట్‌లెట్స్‌ ప్రారంభించాలనేది వారి లక్ష్యం. ఇప్పటికే దేశ విదేశాల నుంచి ఫ్రాంచైజీల కోసం రెండొందలకు పైగా ప్రతిపాదనలు వచ్చాయంటే ఈ టీ పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే యేవలే అన్నదమ్ముల్లో ఎవరూ ఏ మేనేజ్‌మెంట్‌ కోర్సూ చేయలేదు. కనీసం పదో తరగతికి మించి చదవలేదు. కానీ... సంప్రదాయ చాయ్‌ని విభిన్నంగా నోటికందిస్తూ లక్షలు గడిస్తున్న వీరు ఎందరో వ్యాపారవేత్తలకు స్ఫూర్తి ప్రదాతలు.

Saturday, 24 February 2018

శ్రీదేవి ఇక లేరు (ఆమె కన్నుమూశారు)


శ్రీదేవి ఇక లేరు 

కాలం మారిపోతోంది. తరాలు మారుతున్నాయి. వాటితోపాటు కొంతమంది వ్యక్తులూ మన జ్ఞాపకాల్లోంచి చెరిగిపోతుంటారు. కానీ, రోజులెన్ని మారినా ఏళ్లు ఎన్ని గడిచినా మనం మరిచిపోలేని మనుషులు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు. తన అందాలతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన ఆమె ఇక లేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె.. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని సంజయ్‌ కపూర్‌ ద్రువీకరించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి భువి నుంచి దివికి వెళ్లిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది.
బాల నటిగా..
తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. 1967లో బాలనటిగా ‘కన్దన్‌ కరుణాయ్‌’ అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించారు. 1976లో కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘మాండ్రు ముడిచు’లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్‌’.. హీరోయిన్‌గా ఆమెకు తొలి చిత్రాలు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాల్లో నటించారు. 1975-85 మధ్యకాలంలో తెలుగు, తమిళంలో ఆమె నెంబర్‌ వన్‌ కథానాయిక స్థానానికి ఎదిగారు. ఆయా భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ శ్రీదేవి నటించారు. రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు.
సినిమాల్లో ఎంత పేరైతే తెచ్చుకున్నారో వ్యక్తిగత జీవితంలో అన్ని ఇబ్బందులు పడ్డారు. శ్రీదేవి చిన్నప్పటి నుంచి అమ్మంటే ప్రాణం. ఆమెకి తల్లితో ఉన్న అనుబంధం ఎక్కువ. ఆమె మరణం తనకు తీరని లోటని శ్రీదేవి చెబుతుండేవారు. తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్‌ నిర్మాత, హీరో అనిల్‌ కపూర్‌ సోదరుడు బోనీకపూర్‌ను 1996జూన్‌ 2న వివాహం చేసుకున్నారు. వారికి జాహ్నవి, ఖుషి ఇద్దరు పిల్లలు.


సెకండ్‌ ఇన్నింగ్స్‌
పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశారు శ్రీదేవి. అయితే 2004-05 మధ్యకాలంలో మాలినీ అయ్యర్‌గా బుల్లితెర మీద కొద్దికాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలినీ అయ్యర్‌ పాత్ర బాగా పాపులర్‌ అయింది. ఆ సీరియల్‌ అయిపోయాక రెండు మూడుసార్లు టీవీ షోలకు హాజరుకావడం తప్ప నటిగా మళ్లీ తెర మీదకు రాలేదు. అయితే, నిర్మాతగా ‘పోకిరి’ చిత్రాన్ని హిందీలో సల్మాన్‌తో ‘వాంటెడ్‌’గా నిర్మించారు. 2012లో వచ్చిన ‘ఇంగ్లీష్‌-వింగ్లీష్‌’ చిత్రం ద్వారా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవలే ‘మామ్‌’ చిత్రంతో మరోసారి అలరించారు. ప్రస్తుతం ఆమె పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరాఠాలో ఘన విజయం సాధించిన ‘సైరాట్‌’ సినిమాను హిందీలో ‘దడాక్‌’ పేరుతో రిమేక్‌ చేస్తున్నారు. కరణ్‌ జోహర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మృతిపట్ల బాలీవుడ్‌తో పాటు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
అవార్డులు
తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నారు. నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఇక శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్‌ కాగా, నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్‌ జ్యూరీ లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన ‘క్షణక్షణం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్‌ సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ 100 ఇయర్స్‌’గా శ్రీదేవి ఎంపికయ్యారు

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం సినీ తరహాలో బట్టబయలు చేసిన పోలీసులు ఐదుగురు యువతులు, ముగ్గురు విటుల అరెస్టు

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం 
సినీ తరహాలో బట్టబయలు చేసిన పోలీసులు 
ఐదుగురు యువతులు, ముగ్గురు విటుల అరెస్టు

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని గుంటూరు అర్బన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో ఉన్న బౌన్స్‌ బ్యూటీ సెలూన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని అర్బన్‌ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదులందాయి. దీంతో ఆ సెలూన్‌పై నిఘా పెట్టాలని క్యూఆర్టీ విభాగం ఎస్సై నాగుల్‌మీరాను ఎస్పీ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఎస్సై తమ సిబ్బంది మస్తాన్‌, ప్రవీణ్‌, నాగరాజు, నాగేశ్వరరావు, నాగయ్య, మహిళా కానిస్టేబుల్‌తో కలిసి లక్ష్మీపురానికి చేరుకున్నారు. సెలూన్‌ బయట కొంత మందిని ఉంచి.. ఎస్సై మరో కానిస్టేబుల్‌తో కలిసి సాధారణ వ్యక్తులవలేె లోపకి వెళ్లారు. వారు మీకేమి కావాలంటూ ఓ యువతి పలకరించడంతో వారికి అనుమానం రాకుండా క్రాప్‌ (క్షవరం), కాళ్ల గోర్ల్లు తీయించుకోవడానికి వచ్చామని చెప్పారు. అందుకుగాను రూ.700లు ఖర్చవుతుందని చెప్పడంతో వారు ఆ మొత్తాన్ని చెల్లించారు. క్రాప్‌ చేసే, గోర్లు తీసే సమయంలో అక్కడ జరుగుతున్న తంతుపై రహస్యంగా పర్యవేక్షించారు. ఇంతలో కొంతమంది యువకులు సెలూన్‌ లోపల ఉన్న రహస్య గదుల్లోకి వెళ్లడాన్ని ఎస్‌ఐ పసిగట్టారు. దీంతో అక్కడ ఉన్నవారితో సెలూన్‌లో ఇంకా ఏమేమి సౌకర్యాలు ఉన్నాయంటూ మాటలు కలపడంతో పురుషులకు మహిళలతో మసాజ్‌ చేసే సదుపాయం మా ప్రత్యేకత అంటూ చెప్పారు. అలా మాటామాటా కలిపి అక్కడి రహస్య గదుల్లోకి వచ్చే..వెళ్లే వారి ప్రవర్తన తీరు, యువతులను ఆ గదుల్లోకి పంపిస్తున్న తీరును చూసి వ్యభిచారం జరుగుతుందనే నిర్ణయానికి వచ్చారు. రహస్య గదుల్లో వాడిపడేసిన నిరోధులు వారి కంటపడ్డాయి. దీంతో సెలూన్‌ లోపల ఉన్న ఎస్సై బయట ఉన్న కానిస్టేబుళ్లకు సంకేతాలు పంపించడంతో అందరూ కలిసి ఒక్కసారిగా సెలూన్‌ లోపల ఉన్న రహస్య గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18,500ల నగదు, 11 చరవాణిలు (సెల్ ఫోన్ ) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో విజయవాడకు చెందిన సంధ్య, శాంతకుమారి, కృష్ణా జిల్లాకు చెందిన సుకన్య, గుంటూరు నగరాలకు చెందిన లక్ష్మి, మారుతీనగర్‌కు చెందిన మస్తాన్‌బీ, అమరావతి రోడ్డుకు చెందిన ప్రేమ్‌చంద్‌, పశ్చిమ గోదావరి జల్లాకు చెందిన వెంకట సత్యాలరావు, గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన వెంకట నరేష్‌లు ఉన్నట్లు సమాచారం. గుంటూరు నగరం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Friday, 23 February 2018

మోసపూరిత పథకాలపై ఉక్కుపాదం


మోసపూరిత పథకాలపై ఉక్కుపాదం :   ప్రభుత్వం 

దిల్లీ: మోసపూరిత పథకాలతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుని, పరారయ్యే వ్యాపారులకు అడ్డుకట్ట పడనుంది. స్థిరాస్తి, బంగారు ఆభరణాల వ్యాపారులు ‘కచ్చితమైన ప్రతిఫలం’ అందిస్తామని ప్రకటిస్తే, వాటిని సామూహిక మదుపు పథకాలుగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
స్థిరాస్తి అభివృద్ధి సంస్థ కనుక, కొనుగోలుదార్లకు సదరు ఆస్తిని బదలాయించే వరకు ‘స్థిర ప్రతిఫలం అందిస్తామనే’ హామీపై నగదు వసూలు చేస్తే, వాటిని ‘అనియంత్రిత డిపాజిట్లు’గా పరిగణించనున్నారు. ఎక్కువమంది స్థిరాస్తి వ్యాపారులు 9-14 శాతం మొత్తం ప్రతిఫలం ఇస్తామని చెబుతూ, డిపాజిట్‌ రూపేణ నగదు జమ చేసుకుంటున్నారు. మరికొందరు అభివృద్ధిదారులు కూడా కనీసం 10 నెలల పాటు వాయిదాల్లో నగదు చెల్లించాలని కోరుతున్నారు. అనంతరం, డిపాజిట్ల కాలావధికి అనుగుణంగా, నెలవారీ మొత్తంపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇవన్నీ అనియంత్రిత డిపాజిట్ల కిందకే వస్తాయి. అధిక కేసుల్లో స్థిరాస్తి అభివృద్ధి దారులు ప్రారంభంలో కొన్ని నెలల వాయిదాలు చెల్లిస్తారు. అనంతరం వారు చెల్లింపులు ఆపేస్తారు. ఇలాంటివి చట్టం ద్వారా నియంత్రించాల్సి ఉంది. 
ఇదేవిధంగా ఆభరణాల విక్రేతలు కూడా ‘11 నెలల పాటు నెలసరి వాయిదాలు చెల్లించండి, 12న వాయిదాను మా సంస్థ జమచేస్తుంది. ఈ 12 నెలల మొత్తాన్ని వినియోగించుకుని, మా విక్రయశాలోనే ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు’ అని ప్రకటిస్తున్నాయి. 
ఈ రెండు రకాల డిపాజిట్లు ‘అనియంత్రిత డిపాజిట్ల నిషేధ బిల్‌-2018’ పరిధిలోకి రానున్నాయి. మార్చి 5న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. మోసపూరిత సామూహిక మదుపు పథకాలపై ఉక్కుపాదం మోపడమే ఈ బిల్లు లక్ష్యం. నియంత్రణ, అనియంత్రణ పద్ధతుల్లో డిపాజిట్లు వసూలు చేసేవారంతా, సంబంధిత అధీకృత అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేయకుండా పథకాల రూపేణ నగదు వసూలు చేస్తే, ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించింది.


5 మిలియన్‌ డాలర్లు బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించిన సినిమా .........

5 మిలియన్‌ డాలర్లు  బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించిన సినిమా .........  
ఒక సినిమా బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించడమంటే మాటలా..?. అదీ ఓ తొలి చిత్ర దర్శకుడు పెద్దగా పేరు లేని నటులతో అతి తక్కువ వ్యయంతో తెరకెక్కించిన సినిమా అంతటి విజయం అందుకుందంటే ఎంత ఆశ్చర్యం! అంతేకాదు, గతేడాది వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. అంతటితో అయిపోలేదు... ఆస్కార్‌ బరిలోనూ నాలుగు ప్రధాన నామినేషన్లు అందుకుని సత్తా చాటింది. ఆస్కార్‌ చరిత్రలో ఓ హారర్‌ సినిమా ఉత్తమ చిత్రం పురస్కారం కోసం పోటీపడటం చాలా అరుదు. ఆ ఘనత అందుకున్న చిత్రమే ‘గెటవుట్‌’. ఆఫ్రికన్‌ అమెరికన్‌ దర్శకుడు జోర్డాన్‌ పీలె తెరకెక్కించిన ఈ చిత్రంలో డేనియల్‌ కలూయ, అలిసన్‌ విలియమ్స్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ విశేషాలివీ.
హాలీవుడ్‌లో 5 మిలియన్‌ డాలర్లు అంటే చాలా తక్కువ బడ్జెట్‌ కిందే లెక్క. అంతే వ్యయంతో కేవలం 23 రోజుల్లో ‘గెటవుట్‌’ను తెరకెక్కించాడు దర్శకుడు జోర్డాన్‌. అయితే విడుదలయ్యాక మాత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిందీ చిత్రం. సుమారు 255 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. గతేడాది వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా టైమ్‌ మ్యాగజైన్‌, అమెరికన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ ఈ సినిమాను ఎంపిక చేశాయి. గోల్డెన్‌ గ్లోబ్‌, బాఫ్టా లాంటి చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి నామినేషన్లు, ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆస్కార్‌ బరిలోనూ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే లాంటి ప్రధాన విభాగాల్లో పోటీపడుతోంది. ఓ హారర్‌ సినిమా ఈ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకోవడం విశేషమే.
కథేంటి: నల్లజాతీయుడైన ఫొటోగ్రాఫర్‌ క్రిస్‌ వాషింగ్టన్‌(డేనియల్‌), శ్వేతజాతీయురాలైన తన ప్రియురాలు రోజ్‌(అలిసన్‌)తో కలసి ఓ మారుమూల ఉన్న వాళ్ల ఇంటికి వెళ్తాడు. నల్లజాతీయులను ద్వేషించే రోజ్‌ తల్లిదండ్రులు, సోదరుడు క్రిస్‌తో సరిగా మాట్లాడరు. ఇంట్లో పనిచేసే నల్లవారూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. క్రిస్‌ పొగతాగే అలవాటును హిప్నోథెరపీ ద్వారా పోగొడతానని చెప్పి రోజ్‌ తల్లి అతనిపై హిప్నాటిజం చేస్తుంది. దీంతో అతడు ఓ శూన్య ప్రపంచంలోకి జారిపోతాడు. అక్కడ అతనికి బాల్యంలో జరిగిన ఓ దుర్ఘటన కనిపిస్తుంది. పీడకల నుంచి తేరుకున్నట్లుగా మేల్కొన్న క్రిస్‌కు సిగరెట్లపై విరక్తి ఏర్పడుతుంది. కానీ ఇంట్లో వాతావరణం విచిత్రంగా కనిపిస్తుంటుంది. ఆ ఇంటికి ఓ పార్టీకి వచ్చిన కొందరు శ్వేతజాతీయులు, క్రిస్‌ ఫొటోగ్రఫీ ప్రతిభ చూసి అబ్బురపడతారు. అంధుడైన జిమ్‌ హుడ్సన్‌, లోగన్‌ కింగ్‌ అనే నల్లజాతీయుడు కూడా పార్టీకి వచ్చిఉంటారు. లోగన్‌ను క్రిస్‌ ఫొటో తీస్తే పిచ్చివాడిలా కేకలు వేస్తూ గెటవుట్‌ అని అరుస్తాడు. ఇంట్లో వారి విచిత్ర ప్రవర్తన చూసి అనుమానంతో వారి ఫొటోలను తన స్నేహితుడికి పంపుతాడు క్రిస్‌. వాటిలో లోగన్‌ను చూసి అతడు కొన్నిరోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆండ్రె అని వ్యక్తి అని, అక్కడేదో ప్రమాదం పొంచి ఉందని చెబుతాడు స్నేహితుడు. దీంతో అక్కణ్నంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు క్రిస్‌. ఆ విషయం పసిగట్టిన రోజ్‌ కుటుంబ సభ్యులు గేట్లు మూసేస్తారు. రోజ్‌ తల్లి మళ్లీ అతణ్ని హిప్నటైజ్‌ చేసి ఇంటి బేస్‌మెంట్‌లో కుర్చీలో బంధిస్తుంది. అక్కడ అతనికి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. రోజ్‌ కుటుంబం తెల్లజాతీయుల మెదళ్లను నల్లజాతీయుల శరీరాల్లోకి ప్రవేశపెడ్తుంటారని, ఇంట్లో ఉన్న పనిమనుషుల శరీరార్లో రోజ్‌ పూర్వీకుల ఆత్మలున్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు క్రిస్‌ శరీరంలోకి అంధుడైన జిమ్‌ మెదడును ప్రవేశపెట్టడానికి చూస్తుంటారు. దాంతో తనకు చూపుతో పాటు క్రిస్‌లోని ఫొటోగ్రఫీ నైపుణ్యం లభిస్తాయని జిమ్‌ ఆశపడ్తుంటాడు. మరి ఆ ఇంటి నుంచి క్రిస్‌ బయటపడ్డాడా? ప్రాణాలు కాపాడుకున్నాడా? అన్నది ‘గెటవుట్‌’లో చూడాలి.
విశేషాలు :
ర్యాప్‌ సింగర్‌ చాన్స్‌కు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఒకరోజు షికాగోలోని అన్ని థియేటర్లలోని అన్ని టికెట్లనూ అతనే కొని జనాలకు ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించాడు.
తొలి చిత్రంతోనే వంద మిలియన్‌ డాలర్లు వసూళ్లు సాధించిన తొలి నల్లజాతీయుడైన దర్శకుడిగా జోర్డాన్‌ రికార్డు సాధించాడు.

గుడ్డు పెడుతున్న ఇండోనేసియా బాలుడు!

బాలీ: ఇదొక వింత. కోడి గుడ్డును మనిషి పెడుతున్నాడు. అదీ అందరూ చూస్తుండగానే. అసలు ఇది ఎలా జరుగుతోందో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. దక్షిణ ఇండోనేసియాకు చెందిన 14ఏళ్ల అక్మల్‌లో దాగిన మర్మమిదీ..! ఇతడు రెండేళ్లలో 18 గుడ్లు పెట్టాడంటూ అంతర్జాలంలో వార్తలు హల్‌చల్‌చేశాయి. వీటిని అందరూ కొట్టిపారేశారు. అయితే గత సోమవారం తమ ముందే రెండు గుడ్లు పెట్టడంతో వైద్యులు నివ్వెరపోయారు. దీనిలో ఎలాంటి ఇంద్రజాలమూలేదని అక్మల్‌ తండ్రి రుస్లి చెబుతున్నారు. ‘ఇదివరకు అక్మల్‌ పెట్టిన ఓ గుడ్డును పగులగొట్టాను. లోపల అంతా పసుపుపచ్చ సొనే ఉంది. మరొక గుడ్డును అక్మల్‌ తల్లి పగులగొట్టింది. దానిలో పసుపుపచ్చ సొనే లేదు. అంతా తెల్లగా ఉంది. అసలు గుడ్డును అమాంతం ఎప్పుడూ అక్మల్‌ మింగలేదు’అని ఆయన వివరించారు. మరోవైపు అక్మల్‌ గుడ్డును వైద్యులు పరిశీలించారు. ఇవి కోడి గుడ్లలానే ఉన్నట్లు తేల్చారు. ఇవి అతడి కడుపులోకి ఎలా వెళ్లాయనేది అంతుచిక్కడం లేదు. వీటిని కావాలనే మలద్వారం గుండా శరీరంలోకి పంపించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ‘మనిషి గుడ్డు పెట్టడం అసాధ్యం. మలద్వారం గుండా అక్మల్‌ వీటిని శరీరంలోకి పంపించి ఉండొచ్చు. ఇది మా అనుమానం మాత్రమే. అతణ్ని వారంపాటు మా పరిశీలనలో ఉంచి పరీక్షలు చేపడతాం. దీంతో నిజానిజాలు తేలిపోతాయి’అని సంబంధిత అసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఇండోనేసియాలో మనిషి గుడ్డుపెట్టాడంటూ వార్తలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఉత్తర జకార్తాకు చెందిన కాకెక్‌ సినిన్‌ 2015లోనూ ఇదే విషయంతో వార్తల్లోకెక్కారు.